రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ముమ్మరమవుతున్న వేళ, డెంగ్యూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో యాక్టివ్ సర్వైలెన్స్ చేపట్టి, జ్వరాల కేసులను తొలిదశలోనే గుర్తించి తక్షణ వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో మందులు, టెస్ట్ కిట్లు, ప్లేట్లెట్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో పాటు టైఫాయిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆస్పత్రుల ఓపీలు రోగులతో నిండిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా జూలై 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో దోమల ఉత్పత్తి, నీటి నిల్వ ప్రాంతాలు పెరిగే ప్రమాదం ఉంది.
డెంగ్యూ దోమ కుట్టిన 3 నుంచి 14 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. లక్షణాలు కనిపించిన వెంటనే స్వీయచికిత్స మానుకుని, సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
జ్వరం 2-3 రోజులకు మించి తగ్గకపోయినా, తీవ్రమైన నీరసం, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే సమీప ఆస్పత్రిని సంప్రదించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి.