పార్లమెంట్ సెషన్ హీటెక్కుతోంది. ఏపీ పాలిటిక్స్లో రోజుకో ట్విస్ట్.. సరిగ్గా ఇదే టైమ్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అంటూ టాక్ మొదలైంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల తర్వాత జగన్ మొదటిసారిగా ఇద్దరు అగ్రనేతలతో కలవబోతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్గా మారింది.
అసలు జగనే ఢిల్లీకి వెళ్తున్నారో? లేక బీజేపీ పెద్దలే హస్తినకు ఇన్వైట్ చేశారో? రెండు వెర్షన్లు నడుస్తున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి, సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి మోదీ, షా అపాయింట్మెంట్ తీసుకునే బాధ్యతను జగన్ అప్పగించారని ఇన్సైడ్ టాక్. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే ఈ భేటీ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది.
మరి సడన్గా ఈ డెల్లీ ట్రిప్ ఎందుకు?
దీని వెనుక పెద్ద కారణం మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పెంపు) బిల్లులే అంటున్నారు. ఈ సెషన్లోనే వీటిని పార్లమెంట్ ముందు తీసుకురావాలని కేంద్రం సిద్ధమవుతోంది. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. అలాంటప్పుడు వైసీపీ మద్దతు ఎంతో కీలకం. అందుకే జగన్కు హస్తిన నుంచి పిలుపు అందిందని అంటున్నారు. మహిళా రిజర్వేషన్కు వైసీపీ ఎప్పటికే బహిరంగ మద్దతు ప్రకటించింది. డీలిమిటేషన్ జరిగితే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ సీట్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది.
కానీ అసలు ఇష్యూ అది కాదు!
ఏపీలో ఏం జరుగుతోంది? టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలపై అక్రమ కేసులు, జైలు నిర్బంధాలు కొనసాగుతున్నాయని ఫ్యాన్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని, హోంమంత్రితో జగన్ ఈ అంశాన్ని లేవనెత్తే ఛాన్స్ ఉంది. కేంద్రం-రాష్ట్రం మధ్య సంబంధాలు, ప్రతిపక్షంగా వైసీపీ ఎదుర్కొంటున్న సవాళ్లు — అన్నీ టేబుల్ మీదకు రావొచ్చనేది వైసీపీ వర్గాల మాట.
ఇక్కడే అసలు తమాషా!
ఒకవైపు రాష్ట్రంలో బీజేపీ టీడీపీతో ప్రభుత్వంలో పార్టనర్. మరోవైపు జాతీయ స్థాయిలో అదే బీజేపీ జగన్తో టేబుల్ మీద కూర్చుంటోంది! ఈ డబుల్ గేమ్ను చంద్రబాబు ఎలా చూస్తారో! నిజానికి బీజేపీ-వైసీపీ బంధం కొత్తది కాదు. 2019 నుంచి కేంద్రంతో ఘర్షణ కాకుండా సహకార ధోరణి పాటించారు జగన్. పోలవరం, విభజన హామీలు, రాష్ట్ర నిధులు అంశాల్లో కేంద్రాన్ని కలుస్తూనే — పార్లమెంట్లో కీలక బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకే వైసీపీ ఎంపీలు ఓటేశారు. ఇటీవలి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలోనూ ఇదే ధోరణి కనిపించింది.
మరి ఈసారి భేటీ ఏం చెప్పబోతోంది? జాతీయ రాజకీయాల్లో వైసీపీ ఎప్పుడూ ఏ కూటమిలోనూ పూర్తిగా చేరలేదు. అవసరమైనప్పుడు కేంద్రానికి సపోర్ట్ ఇస్తూ, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ వచ్చిందనేది ఫ్యాన్ పార్టీ లైన్. కానీ ఈ ఢిల్లీ టూర్ కేవలం “మద్దతు కోసమే” నా? లేక బీజేపీ-వైసీపీ సంబంధాల్లో ఏదైనా కొత్త అధ్యాయానికి తెరతీయబోతోందా? ఏపీ రాజకీయాల్లో ఈ భేటీ ప్రకంపనలు సృష్టిస్తుంది అనేదే అందరి డౌట్.