విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారికి ఇండిగో ఎయిర్లైన్స్ శుభవార్త అందించింది. ఆగస్టు 13, 2026 నుంచి విజయవాడను ఉత్తర భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసి, తూర్పు భారతదేశంలోని ప్రధాన వాణిజ్య నగరం కోల్కతాతో అనుసంధానిస్తూ కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విజయవాడ నుంచి వారణాసి, కోల్కతాకు నేరుగా విమాన అనుసంధానం కల్పించడం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ఈ సేవల వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు పర్యాటక, వ్యాపార రంగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విమాన సర్వీసులు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో అందుబాటులో ఉంటాయని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.
విజయవాడ–వారణాసి విమాన షెడ్యూల్
Flight No : 6E 6502
విజయవాడ నుంచి బయలుదేరు సమయం: సాయంత్రం 6:20 గంటలకు
వారణాసి చేరే సమయం: రాత్రి 8:15 గంటలకు
తిరుగు ప్రయాణంలో:
Flight No : 6E 6501
వారణాసి నుంచి బయలుదేరు సమయం: సాయంత్రం 3:55 గంటలకు
విజయవాడ చేరే సమయం: సాయంత్రం 5:50 గంటలకు
విజయవాడ–కోల్కతా విమాన షెడ్యూల్
అదే 6E 6502 విమానం వారణాసి మీదుగా ప్రయాణించి రాత్రి 10:15 గంటలకు కోల్కతా చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 6E 6501 విమానం మధ్యాహ్నం 2:10 గంటలకు కోల్కతా నుంచి బయలుదేరి వారణాసి మీదుగా సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
ప్రయాణికులకు ఎలా ఉపయోగపడుతుంది?
ఈ కొత్త విమాన సర్వీసుల ద్వారా విజయవాడ నుంచి కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులకు, కోల్కతాకు వెళ్లే వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు, పర్యాటకులకు ప్రయాణం మరింత సులభం కానుంది. నేరుగా మెరుగైన కనెక్టివిటీ లభించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర, తూర్పు భారతదేశాలకు రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి.
ఈ కార్యక్రమంలో ఇండిగో ఏపీ సేల్స్ మేనేజర్ మోహిత్ కృష్ణ, విజయవాడ అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్) సుభాని పాల్గొన్నారు.