రోడ్డు ప్రమాదం జరిగితే డబ్బుల్లేక వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి ఇక చెక్ పడనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Cashless Treatment Scheme దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మే 5, 2025 నుంచే ఈ పథకం మొదలైనప్పటికీ, చాలామందికి దీని గురించి పూర్తి అవగాహన లేదు.
ప్రమాదం జరిగిన మొదటి గంట, అంటే గోల్డెన్ అవర్లో వైద్యం అందకపోతేనే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ ఈ Cashless Treatment Scheme రూపొందించింది.
ఈ పథకం కింద ప్రతి బాధితుడికి గరిష్టంగా ₹1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల వరకు ఈ చికిత్స ఉచితంగా లభిస్తుంది. డబ్బులు కట్టాలన్న భయం లేకుండా ఆసుపత్రిలో వెంటనే చేర్చుకోవచ్చు.
భారతీయులే కాదు, విదేశీయులు కూడా ఈ స్కీమ్కి అర్హులు. ఏ రకమైన రోడ్డుపై, ఏ మోటారు వాహనం వల్ల ప్రమాదం జరిగినా ఇది వర్తిస్తుంది.
ఎక్కడ చికిత్స చేయించుకోవాలి?
ఆయుష్మాన్ భారత్ (PM-JAY) కింద నమోదైన ఆసుపత్రులు, ప్రభుత్వం నోటిఫై చేసిన ట్రామా సెంటర్లలో ఈ సేవలు అందుతాయి. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించాలి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ చేర్చిన ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోతే, మరో ఆసుపత్రికి తరలించే బాధ్యత, ఖర్చు కూడా ఆ ఆసుపత్రే భరించాలి.
హిట్ అండ్ రన్ కేసుల్లో ఇప్పటికే ఉన్న పరిహారం కూడా కొనసాగుతుంది. మరణించిన వారి కుటుంబాలకు ₹2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹50,000 అందుతాయి.
“రాహ్వీర్స్”కి ₹25,000 రివార్డ్
ఫిబ్రవరి 2026లో ఇదే స్కీమ్ని ప్రధాని మోదీ “PM RAHAT” (Road Accident Victim Hospitalisation and Assured Treatment) పేరుతో మళ్లీ లాంచ్ చేశారు. దీనిలో కొత్తగా ఒక ఫీచర్ చేర్చారు — ప్రమాదం జరిగినప్పుడు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే వ్యక్తికి ప్రభుత్వం ₹25,000 రివార్డ్ ఇస్తుంది. ఇలాంటి సాయం చేసేవారిని “రాహ్వీర్స్” అని పిలుస్తారు. చాలామంది భయంతో, పోలీసు కేసుల్లో ఇరుక్కుంటామనే ఆందోళనతో ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వెనుకాడతారు. ఈ రివార్డ్ స్కీమ్ ఆ భయాన్ని తగ్గించి, మరింత మంది ముందుకొచ్చి సాయం చేసేలా ప్రోత్సహించడమే లక్ష్యం.
ఈ Cashless Treatment Scheme ఖర్చును మోటారు వాహన ప్రమాద నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం, బీమా కంపెనీలు కలిసి భరిస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సహాయం కోసం 112కి కాల్ చేయవచ్చు, లేదా e-DAR మొబైల్ యాప్ ద్వారా వివరాలు అందించవచ్చు.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లో ఈ స్కీమ్ గురించి అవగాహన పెరిగితే, ఎంతోమంది ప్రాణాలు కాపాడుకోవచ్చు.