AP EAPCET 2026 ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం విడుదలయ్యాయి…మే 12 నుంచి 20 వరకు 140 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవగా, వారిలో 2.45 లక్షల మంది అర్హత సాధించారు. మొత్తం అన్ని సెట్లు కలిపి 3.63 లక్షల మంది విద్యార్థులు అర్హత పొందారని ఉన్నత విద్యామండలి తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం జూన్ 1నే ఫలితాలు రావాల్సి ఉన్నా, ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు, CBSE రివైజ్డ్ ఫలితాల కోసం వేచి చూడాల్సి రావడంతో జాప్యం జరిగింది. ఇంటర్ మార్కులకు ర్యాంకులో 25% వెయిటేజీ ఉండటంతో, ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో అధికారులు ఫలితాలను జూలై 1కి వాయిదా వేసి, ఆ తర్వాత విడుదల చేశారు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, జన్మతేదీ నమోదు చేసి అధికారిక వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో ఈసారి బాలికలు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం విశేషం.
రిజర్వేషన్ల విషయంలో 2025-26 ఉత్తర్వులనే 2026-27కు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర రీజియన్ల వారీగా స్థానికులకు 85%, స్థానికేతరులకు 15% కోటా అమలవుతుంది.
ర్యాంక్ కార్డ్ను వెంటనే డౌన్లోడ్ చేసుకుని సురక్షితంగా ఉంచుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్, డాక్యుమెంట్ల జాబితా వంటి వివరాల కోసం అధికారిక APSCHE వెబ్సైట్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. విజయవాడ, గుంటూరు పరిధిలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల వివరాల కోసం బెజవాడ బులెటిన్ ‘తెలుసుకోండి’ విభాగాన్ని సందర్శించవచ్చు.