బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి అందుబాటులోకి రానుంది. Bengaluru Vijayawada Economic Corridor పనుల్లో కీలక ముందడుగు పడింది. ఈ మార్గంలో నిర్మిస్తున్న 3.68 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనుల్లో బ్రేక్త్రూ పూర్తయింది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో కీలక ముందడుగు పడింది.
ఎన్హెచ్-544జీలోని ప్యాకేజీ-9లో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సీతారామపురం మధ్య ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. కొండలు, అటవీ ప్రాంతం గుండా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన మార్గానికి బదులుగా.. సొరంగం ద్వారా రెండు ప్రాంతాలను నేరుగా కలపనున్నారు.
ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఈ భాగంలో ప్రయాణ దూరం సుమారు 17 కిలోమీటర్లు తగ్గనుంది. రూ.1,092.18 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను 2027 మధ్య నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అసలు ఈ కారిడార్ ప్రత్యేకత ఇక్కడే ఉంది. మొత్తం 343 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే బెంగళూరు–విజయవాడ మధ్య ప్రస్తుత ప్రయాణ దూరం సుమారు 110 కిలోమీటర్లు తగ్గనుంది. ప్రయాణ సమయం కూడా 3 నుంచి 4 గంటల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం బెంగళూరు నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో వెళ్లేవారు పలు ప్రాంతాలను చుట్టి ప్రయాణించాల్సి వస్తోంది. కొత్త కారిడార్ అందుబాటులోకి వస్తే వేగవంతమైన ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది.
ఈ ప్రాజెక్టు కేవలం బెంగళూరు–విజయవాడ మధ్య ప్రయాణానికే పరిమితం కాదు. ఎన్హెచ్-44, ఎన్హెచ్-16లను అనుసంధానించే ఈ కారిడార్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి మెరుగైన రహదారి కనెక్టివిటీ లభించనుంది.
హిందూపురం, కొప్పర్తి వంటి పారిశ్రామిక ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. సరకు రవాణా వేగంగా జరిగేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
కారిడార్లో మొత్తం 17 ఇంటర్చేంజ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల కోసం 10 వే సైడ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. మొత్తం ప్రాజెక్టులో సుమారు 5.3 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు ఉండగా.. దాదాపు 21 కిలోమీటర్ల రహదారి అటవీ ప్రాంతం గుండా సాగనుంది.
ప్రస్తుతం 3.68 కిలోమీటర్ల సొరంగం తవ్వకంలో బ్రేక్త్రూ పూర్తవడం ప్రాజెక్టులో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అయితే సొరంగం మొత్తం నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. మిగిలిన పనులు కొనసాగాల్సి ఉంది.
కారిడార్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత బెంగళూరు–విజయవాడ మధ్య ప్రయాణ దూరం, సమయం తగ్గడంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.