విజయవాడ ఫ్లడ్ అలర్ట్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. వరద భయం తగ్గే రోజులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా “సిటీ ఫ్లడ్ అలర్ట్” పేరుతో ఒక AI టెక్నాలజీ ప్లాట్ఫారమ్ను తీసుకొచ్చింది.
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS), రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA), IIT-గాంధీనగర్ కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి. వరద వచ్చేముందే హెచ్చరించడం దీని ప్రధాన లక్ష్యం.
ఇంతకీ ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? శాటిలైట్ చిత్రాల ఆధారంగా రూపొందించిన హై-రిజల్యూషన్ డిజిటల్ ఎలివేషన్ మోడల్ను, గత మూడు దశాబ్దాల బుడమేరు వరద డేటాను కలిపి విశ్లేషిస్తుంది.
దీని ద్వారా వర్షం 48 గంటల ముందే, ఫ్లాష్ ఫ్లడ్స్ 6 గంటల ముందే తెలిసిపోతాయి. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించడం, వేర్వేరు వర్ష పరిస్థితుల్లో నీరు ఎక్కడ నిలుస్తుందో సిమ్యులేట్ చేయడం, డ్రైనేజీ ఛానెల్స్లో పూడిక ఎంత ఉందో లెక్కించడం — ఇవన్నీ ఈ ప్లాట్ఫారమ్ చేస్తుంది.
ముప్పు గుర్తించిన వెంటనే APSDMAకి ఆటోమేటిక్గా అలర్ట్ వెళుతుంది. వెంటనే జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఫీల్డ్ అధికారులకు సమాచారం చేరుతుంది. ముందస్తు జాగ్రత్తలు, ఎమర్జెన్సీ టీమ్ల మోహరింపు, ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజల తరలింపు — అన్నీ సకాలంలో జరిగే అవకాశం ఉంటుంది.
బుడమేరు వాగు వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాలు ప్రతి వర్షాకాలం వరద కోరల్లో చిక్కుకోవడం విజయవాడకు కొత్తేమీ కాదు. అందుకే మొదటగా ఈ సిటీలోనే దీన్ని ప్రవేశపెట్టారు.
విజయవాడలో విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థలకూ ఈ సిస్టమ్ను విస్తరించనున్నారు.
టెక్నాలజీతో వరద ముప్పును ముందే పసిగట్టే ఈ ప్రయత్నం విజయవాడ వాసులకు ఎంతవరకు ఊరటనిస్తుందో చూడాలి.